ఇస్మాయిల్ రచనల సంగ్రహం

ఇస్మాయిల్ గారి హైకూలు, కవితలు, వ్యాసాలు, ఇంటర్వ్యూలు...

Saturday, November 3, 2012

శ్రీ స్మైల్ చేసిన ఇంటర్‌వ్యూ

(1988లో ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం. తేదీ గుర్తులేదు)

ప్ర: మిమ్మల్ని స్పృశించిన సాహిత్య ప్రభావాలేమిటి? అవేమైనా మీకు మార్గనిర్దేశం చేసాయా?

జ: నా ఎనిమిదో ఏట కృష్ణశాస్త్రి గారి పాటల్ని విన్నాను. సీతా అనసూయలు పాడగా, అప్పుడే నాకు స్వర్గలోకపు ద్వారాలు తెరుచుకున్నాయి. కృష్ణశాస్త్రి గారిని మొదటిసారి అప్పుడే చూట్టం. భూలోకానికి దిగి వచ్చిన గంధర్వుడిలా ఉండేవాడాయన. తరువాత శ్రీశ్రీ కవిత్వంతో పరిచయం. పత్రికల్లో అక్కడక్కడా వచ్చినవి కత్తిరించి దాచుకునేవాణ్ణి. ఆ రోజుల్లోనే చలం, కుటుంబరావుల తుఫానులో చిక్కుకున్నాను. నా క్షితిజ రేఖ క్రమంగా విస్తరించి టాగోర్‌ని, జయదేవుడు మొదలైన వైష్ణవ కవుల్నీ, వాళ్ళ సోదరులైన సూఫీ కవుల్నీ ఆవరించింది. ఇంగ్లీషు కవుల్లో మొదట నన్ను ఆకర్షించిన వారు ఆడేన్, స్పెండర్, డే లూయీ, మెక్‌నీస్‌లు. అక్కణ్ణించి నా దృష్టి కాంటినెంట్ మీదికి గెంతి, ఫ్రెంచి సింబలిస్టు కవులమీదికీ, లోర్కా, మొదలైన స్పానిష్ కవుల మీదకీ, రిల్కే వంటి జర్మన్ కవులపైకి ప్రసరించింది. ఆ తర్వాత ఎంతో మంది కవులు ఏయే దేశాల వాళ్ళు నన్ను ఆకర్షించారో చెప్పడానికి సమయం చాలదు.
ఇక మార్గ నిర్దేశమంటారా? మన పూర్వ కవుల్నించి నేర్చుకోవలసింది ఎలా రాయాలో కాదు. ఎలా రాయకూడదో ముఖ్యంగా నేర్చుకోవాలి. నేను కృష్ణశాస్త్రి గారి లాగే రాస్తే ఇక నేనెందుకు?


ప్ర: చాలామంది కవులకి వృద్ధులైపోయినా బాల్యం వదలదు. అంటే అప్పటి జ్ఞాపకాలు వాటి ప్రభావాలూనూ. మీ బాల్యంలో ఏవైనా సంఘటనలు ప్రగాఢమైన అనుభూతిని మిగిల్చాయా? అలాంటి అనుభూతి మీ కవిత్వాన్ని ఎలా ఉద్దీపింపజేసింది?

జ: నా బాల్యం ఎంతో ఆనందమయంగా, ప్రేమ మయంగా గడిచిపోయింది. ఆ ఆనందంతో, ప్రేమతో, అమాయకత్వంతో, అద్భుతంతో నా కవితా ప్రపంచాన్ని నింపాలని అప్పట్నుంచి నా ప్రయత్నం. నా బాల్యం గోదావరి తీరంలోనూ, పంట కాలువల గట్లపై, కొబ్బరి తోటల నీడల్లోనూ గడిచింది. మా అమ్మమ్మ ఒళ్ళో కూచుని గోదావరిపై లాంచీలో ప్రయాణం చెయ్యటమూ, వెన్నెల రాత్రులు వెండి ఇసుకలో చెడుగుడూ, ఉప్పాట ఆడుకోవటమూ, కొబ్బరాకులపై వెన్నెల వయొలిన్లు, నిశ్శబ్ద సంగీతం వాయిస్తుంటే ఆరు బయట నిద్రలోకి జారటమూ, చెరువంచున గంటలకొద్దీ కూచుని జలాంతర్లోకాల అద్భుతాన్ని తిలకించటమూ, గాలి జోరుకి వంగిన పడవలో అంచున కూర్చుని రయ్యిన వెనక్కి పోయే నీళ్ళని వేళ్ళతో చీలుస్తూ గోదావరి దాటటం - చిన్నతనపు ఆనందాలూ, అద్భుతాలూ ఎన్నటికీ మరువలేను.


ప్ర: సాహిత్యంలో ముఖ్యంగా కవిత్వంలో స్తబ్ధత ఏర్పడిందని కొందరు సాహిత్యకారులు అభిప్రాయపడుతున్నారు కదా? మీ ఉద్దేశ్యం ఏమిటి?

జ: స్తబ్ధత ఎక్కడిది? ఈ మధ్య ప్రతిభావంతులైన యువకవులు చాలా మంది వచ్చారు. మనం స్తంభించిపోయామని నేననుకోను.


ప్ర: కవిత్వంలో అస్పష్టత గురించి మీ ఉద్దేశం ఏమిటి?

జ: అస్పష్టత గురించి మాట్లాడినప్పుడు సాధారణంగా వాళ్ళ దృష్టిలో ఉన్నది ambiguity (బహుళార్థకత్వం) అస్పష్టత వేరు, ambiguity వేరు. ambiguity వ్యంగ్యవైభవాన్ని సూచిస్తుంది. కవిత్వం అనేక అర్థాల నీడల్ని పరుస్తుంది. ప్రతి కవితలోనూ దిగే కొద్దీ లోతులు తగుల్తుంటాయి. దీన్ని ambiguity అంటారు. ఇది కవిత్వానికి ప్రాణం. అస్పష్టత చేతకాని తనానికి సంబంధించిది. భాషని ప్రయోగించడం చాతకాకపోతే అస్పష్టత సిద్ధిస్తుంది మన కవులెవరూ చాతకాని వారనుకోను. ఎవరిలోనూ నాకు అస్పష్టత కనిపించలేదు. వేగుంట మోహన్‌ప్రసాద్ కవిత్వంలో అస్పష్టత ఉందని కొందరు విమర్శకులు అనగా విన్నాను. అది అస్పష్టత కాదు. సంక్లిష్టత(complexity). సర్రియలిస్టు కవిత్వం అవచేతనలోంచి పైకుబికే సంసర్గ భావాల సమాహారం. ఈ పద్ధతి మనకు కొత్త. కొత్త వాటిని, మన అలవాట్లకు వింతైన వాటిని కొట్టి పారేయటం మనవాళ్ళ దుర్గుణం. అస్పష్టత, ambiguity భేదాన్ని మన విమర్శకులు ఇకనైనా గ్రహిస్తారని ఆశిస్తున్నాను.


ప్ర: పాఠకుడు కవి ఎత్తుకు ఎదగాలా? కవే పాఠకుడి స్థాయికి దిగాలా? మీ ఉద్దేశమేమిటి?

జ: ఇద్దరూ కలిసి భాష స్థాయికి ఎదగాలి. తనకు ఉపయోగించే భాషనిమలచుకోలేని వాడూ, ఆ భాషని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించని వాడూ, ఆ భాషని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించని వాడూ, వీరిద్దరూ కవిత్వం రాయడానికీ, ఆస్వాదించడానికీ అనర్హులు. గణితశాస్త్రం, భౌతికశాస్త్ర్అం లాంటి ఏ విజ్ఞానశాస్త్రమైనా, సంగీతం, చిత్రలేఖనం లాంటి ఏ కళైనా అందులో కృషి చేసి కనీస పరిజ్ఞానం సంపాదించిన వాళ్ళకి కాని అర్థం కావే? ఒక్క కవిత్వం మాత్రం జనసామాన్యానికి ఏ అర్హత లేకుండానే అర్థం కావాలనడంలో నాకర్థం కనిపించడం లేదు. పాఠకుడిలో కనీసం సహృదయత ఉండాలి కదా?


ప్ర: మరి కవిత్వం చదవడానికి, అర్థం చేసుకోవడానికి కొంత నేపథ్యం ఉండాలనుకుంటే కవిత్వం పరిధి చాలా పరిమితం అయిపోయినట్టే కదా?

జ: ఔను. ఏ శాస్త్రానికి, కళకైనా దాని పరిధులు పరిమితమే. ఆ పరిధిలో ఉన్నంత సేపే అది శాస్త్రం కానీ, కళ కానీ అనిపించుకుంటుంది. కవిత్వం వల్ల కొంపలు కాల్తాయి. విప్లవాలు వస్తాయి అని మీరనుకున్నట్టయితే నిరాశ కోసం సిద్ధపడండి. కవిత్వం పాఠకుల చైతన్యంపై చాలా సున్నితంగా పని చేస్తుంది. అది చేసే పనల్లా చదువరి మనస్సులో దీపం వెలిగించడమే. దీని వల్ల అతని అవగాహన పరిధి విస్తరిస్తుంది. తన మనస్సులో వెలిగిన దీపం వెలుతురు తన దారి తను వెతుక్కోవడానికి సహాయపడుతుంది. ఫలానా దారినే నడవమని ఒకరు చెబితే వినడు మనిషి. అది తనకు తోచాలి. తన దారేదో తను నిర్ణయించుకోవాలి. ఈ నిర్ణయానికి కవిత్వం తోడ్పడుతుంది.


మరొకటి : కవిత్వం జీవిత విలువల్ని వెలికిదీసి ప్రతిష్ఠిస్తుంది. ఈ విలువలు ఒక సాహిత్యానికే కాదు. జీవిత రంగాలన్నిటికీ సంబంధించినవి. వీటిని పరిగ్రహించటం వల్ల రాజకీయాలు కూడా క్షాళమౌతాయి. రాజకీచకులు సాహిత్యం నించి నేర్చుకుని బాగుపడవలసింది చాలా ఉంది.


ప్ర: మార్క్సిజం, తత్సంబంధమైన కవిత్వం మింగుడు పడని మాత్ర అయిందేమిటి? మార్క్సిజంలో కవిత్వం ఇమడదనా, కవిత్వంలో మార్క్సిజం ఉండకూడదనా?

జ: కార్ల్ మార్క్స్‌తో కానీ, అతని రాజకీయ సిద్ధాంతాలతో కానీ నాకు వైరమేమీ లేదు. వచ్చిన చిక్కంతా మార్క్స్‌ని అభినవ భగవంతుడుగానూ, అతని సిద్ధాంతాలని అభినవ మత మౌఢ్యంగానూ మార్చిన మార్క్సిస్టులతోనే. మనల్ని దారి తప్పించడానికి ఉన్న మతాలు చాలు. కొత్తమతం అవసరం లేదంటున్నాను. మార్క్స్ సూత్రాలు నిరపేక్ష నిశ్చాయకాలు (absolutely certain). శాస్త్రం మొదలు కళ వరకు అన్ని రంగాలకి తిరుగులేకుండా వర్తిస్తాయని మార్క్సిస్టులు పిడివాదం చేస్తారు. విజ్ఞాన శాస్త్రీయ సూత్రాలు నిశ్చాయకాలని శాస్త్రమే అనదు. పిడుక్కీ బియ్యానికీ ఏకమంత్రంగా ఉపయోగించే అటువంటి సార్వత్రిక సూత్రాలెక్కడా లేవు. మతమౌఢ్యంలో తప్ప. కనుక ఈ మార్క్సిస్టు క్లెయిం నేనొప్పుకోను.

మార్క్సిస్టు కవిత్వం, నాన్-మార్క్సిస్టు కవిత్వం వేరువేరుగా ఉంటాయని నేననుకోను. ఏ కవిత్వమైనా కవి వైయక్తిక అనుభవంలో ఉద్భవించాల్సిందే. నిజమైన కవిత్వం మార్క్సిస్టు రచించినా, నాన్-మార్క్సిస్టు రచించినా నాకు ఆదరణీయమే. ప్రాథమిక మానవ అనుభవానికి దిగేటప్పటికి అంతా ఒకటే. అంతా మనుషులే.

ఐతే నేనడిగేది మార్క్సిస్టులు తెలుగు కవుల మస్తిష్కాలపై రాజ్యం చేస్తున్న కాలంలో, అనగా 1950-70 మధ్య అంత చచ్చు కవిత్వం ఎందుకు పుట్టుకొచ్చిందని? అది మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంత లోపమా? ఆ కవిత్వాలు రాసినవారు దొంగ మార్క్సిస్టులైనా అయి ఉండాలి. లేదా దొంగ కవులైనా అయి ఉండాలి. అది వాళ్ళనే నిర్ణయించుకోమంటున్నాను.


ప్ర: చుట్టూ సమాజ పరంగా ఎన్నో సమస్యలున్నాయ్ కదా, వాటి ప్రభావం వ్యక్తి మీద తప్పకుండా ఉంటుంది కదా, వైయక్తికమైన అనుభూతులకి అంతగా చలించి వాటికి కవిత్వంలో పలికించే కవి ఎంతో దారుణమైన సమాజ పరిస్థితులకి చలించకుండా ఉండడం సాధ్యమా?

జ: సాధ్యం కాదు. ఐతే కవి ప్రతిస్పందనని అతని వ్యక్తిత్వం, మానసిక వాతావరణం, చేతనా(sensibility), సొంత అనుభవాలూ కలిసి నిర్ణయిస్తాయి. జీవితం తన ముందు నిలిపే సమస్యలకి కవుల ప్రతిచర్య (reaction) ఒక్కొక్క యుగంలో ఒకలా ఉంటుంది. సామాజిక ప్రతిబంధకాలపై, దుర్మార్గాలపై తిరగబడి స్వేచ్ఛని కోరిన భావకవులు విరహవ్యంజకమైన భావకవిత్వం రాశారు. ఫ్రాన్స్‌లో నాజీ దురాక్రమణ సమయంలో resistanceకి చెందిన ఫ్రెంచి కమ్యూనిస్టు, సర్రియలిస్టు కవులు ప్రణయ గీతాలు రచించి, కవాతు పాటలుగా పాడుకున్నారు. వాళ్ళ ప్రేయసి స్వాతంత్ర్యానికి ప్రతీక. కనుక ప్రాపంచిక సంఘటనలకి కవి స్పందించే విధం చాలా సున్నితంగా, పరోక్షంగా mysteriousగా ఉంటుంది. ఈ విషయం కవికే వదిలివేయాలి. నువ్విలా రాయి, అలా రాయి అని కవిని శాసించడం హాస్యాస్పదం. బ్రహ్మాండం బద్దలయ్యే సంఘటన్అలకి బ్రహ్మాండం బద్ధలయే కవిత్వం పుడ్తుందని ఆశించడం అమాయకత్వం. మనకి స్వాతంత్ర్యం సిద్ధించి నలభై ఏళ్ళయింది. ఇంత గొప్ప విషయం మీద చక్కగా ఒక్క మంచి కవిత ఇంతవరకూ పుట్టిందా? చూపించండి చూద్దం. కనక, కవి ప్రతిస్పందన ఎన్నడూ డైరక్టుగా ఉండదు. ప్రత్యక్షానుభవం కవి యొక్క unconsciousలో మునిగి , మరో రూపంలో పైకి తేలుతుందని అనుకోవాలి. “ఈ సమస్య మీద నువు ఇలా రాయి, అలా రాయి” అని రాజకీచకులు కవుల్ని శాసించటం చూస్తే నాకు నవ్వొస్తుంది.


ప్ర: మీరు యువకుడిగా మార్క్సిజం ప్రభావంలోకి వచ్చారని ఓసారి చెప్పారు. మరి ఇప్పుడు ఏ దారీ చూపించని సిద్ధాంతంగా అది మిమ్మల్ని ఏమైనా నిరాశపర్చిందా?

జ: ఔను.


అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు, మొహరమున తా
నెక్కిన పారని గుర్రము
క్రక్కున విడువంగవలయు గదరా సుమతీ!


ప్ర: మార్క్సిస్టు భావాలున్న కొందరు మంచి కవిత్వం రాస్తున్నారంటారా?

జ: రాస్తున్నారు.


ప్ర: అయితే, కవిత్వంగా వాళ్ళు రాసింది మీకు నచ్చినప్పుడు, రాసిన దాంట్లో మార్క్సిజం ఉంటే మాత్రం ఏమైంది?

జ: ఏమీ కాలేదు. నాకు కావలసింది హృదయ స్పర్శి ఐన మంచి కవిత్వం. అది ఎవరురాసినా ఆనందిస్తాను. నాకు మార్క్సిజం మీద కోపం లేదని మీకు ముందే చెప్పాను.


ప్ర: ఎవరి కవిత్వాన్ని వాళ్ళు చెప్తారు. వేరు వేరు కవిత్వాలకి వేరు వేరు చదువరులుంటారు. పూర్వం నుంచి ఇప్పటి వరకు వచ్చిన వివిధ కవిత్వాలు ప్రతిపాదించిన భావాలని అందరూ ఒకే రకంగా ఆమోదించలేరు కదా. భక్తి కవిత్వాన్ని ఒకరు ఒప్పుకుంటే, మరొకరు ఒప్పుకోరు. అలాగే శృంగార కవిత్వం, ప్రబంధ కవిత్వాల విషయంలో కూడా ఆమోద తిరస్కారాలు ఎప్పుడూ ఉంటాయి కదా. అలాంటప్పుడు కావలసిందల్లా కవిత్వమే అని అనడం సబబవుతుందా?

జ: సబబే. నేను అజ్ఞేయవాదిని. (agnostic) ఐనా, నేను టాగోర్ కవిత్వాన్నీ, సూఫీ కవిత్వాన్నీ, వైష్ణవ గీతాల్నీ ఆస్వాదించగలను. మార్క్సిస్టుల్లో సహృదయులైన వాళ్ళు వాటిని తిరస్కరించరనే అనుకుంటున్నాను. ఎందుకంటే మానవత్వపు అడుగుపొరల్ని తాకే గుణం కవిత్వానికి ఉంది. ఆ లోతుల్లోకి దిగాక మనుషులంతా ఒకటే. సిద్ధాంత భేదాలు అంత దూరం వేళ్ళు చాపలేవు.


ప్ర: సరే, సమాజంలో ఒక వ్యక్తిగా మీ దృక్పథం ఏమిటి?

జ: ఆర్థిక, సాంఘిక అసమానతలు లేని సమాజాన్ని నేను ఆశిస్తున్నాను. చైనాలో వాళ్ళు ఇటీవల సాధించిన ఫలితాలు చూస్తే నాకాశ్చర్యం వేస్తుంది. మనం ఎందుకు చెయ్యలేమా అనిపిస్తుంది.


ప్ర: మీ వ్యాసాలు, విమర్శలు చదివితే, ఎంతో స్పష్టంగానే కాక మీరు గొప్ప వచనం రాస్తారని తెలుస్తుంది. విమర్శ విషయానికొస్తే నిష్పక్షపాత దృష్టిని ఒకటి విమర్శకుడికి ఉండాలంటారా? ఒక విషయాన్ని వివిధ కోణాల్నుంచి చూడవచ్చుననుకుంటే ఒక కోణంలో చూట్టమే రైటనీ తతిమ్మా పద్ధతులు తప్పనీ చెప్పడం కంటే, అన్ని కోణాల్లోంచి దృశ్యాల్ని చూడటం మంచిది కదా?

జ: నేననేది అదే. ఈ ప్రశ్న అడగవలసింది నన్ను కాదు. మార్క్సిస్టులని.


ప్ర: ఇంగ్లీషులో ఉన్న సాహిత్య విమర్శకు దీటైన విమర్శ మనకు ఉన్నదా?

జ: లేదు. బాగా అభివృద్ధి చెందిన ఇంగ్లీషు మాట అటుంచండి. మనకన్నా ఆర్థికంగా వెనుకబడి ఉన్న పొరుగు రాష్ట్రం ఒరిస్సాలో వస్తున్న విమర్శ లాంటిదైనా మనకు లేదు.


ప్ర: ప్రస్తుతం పత్రికల్లో వస్తున్న కవిత్వం చదువుతున్నారు కదా?
జ: హింసాత్మక, భూతాత్మక కథలు వెయ్యటం మొదలెట్టాక పత్రికలు చదవటం మానేశాను.


ప్ర: ఈ మధ్య కాలంలో శివారెడ్డి, గోదావరి శర్మ, చినవీరభద్రుడు, అఫ్సర్, రవూఫ్, శిఖామణి, త్రిపురనేని శ్రీనివాస్ ఇలా ఎందరో యువకులు పత్రికల్లో ప్రచురించడమే కాకుండా సంకలనాలు కూడా తెచ్చారు. వీరి గురించి మీ ఉద్దేశ్యమేమిటి?

జ: వీళ్ళంతా నాకు ఇష్టులు, మంచి ప్రతిభావంతులు.


ప్ర: స్త్రీలు అడపాదడపా రాసినా, తెలుగులో కవిత్వ రంగం చిత్రంగా మగవాళ్ళకే పరిమితమైనట్లుగా కనిపిస్తోంది. ఎందువల్లనంటారు?

జ: నా చిరకాల అనుమానం నిజమేనన్న మాట. మొదట్నుంచి నా అనుమానమేమిటంటే ఆడవాళ్ళకి మానసికంగానూ, శారీరకంగానూ, మగ వాళ్ళ కన్నా ఆనందించే capability ఎక్కువని, అందుకనే వాళ్ళు కవిత్వం రాయలేకపోతున్నారు. ఎందుకంటే, కవిత్వోద్భవానికి కావలసింది మానసికమైన అశాంతి. మనస్సులో కీకారణ్యాలు విస్తరిస్తేనే కాని, కవిత్వ వ్యాఘ్రం అందులో సంచరించదు. పోన్లెండి. వాళ్ళనైనా సుఖపడనివ్వండి!


ప్ర: మీరు ముస్లింగా, ఒక మైనారిటీ మతస్తునిగా సమాజంలోనూ, సాహిత్యరంగలోనూ ఎలా ఫీలవుతున్నారు?

జ: మతం గురించి, కులం గురించి ఆలోచన నాకెప్పుడూ రాలేదు. నేను మొదట్నించీ అందర్లో ఒకణ్ణిగా, తెలుగువాణ్ణిగా ఫీలవుతూ వచ్చాను. నా పని నేను చేసుకుంటూ, ఎవరితోనూ ఏ బిరుదు కోసమూ అవార్డుకోసమూ పోటీ పడలేదు. కనుక, నా మైనారిటీ మతం నాకు handicap కాలేదు. కాని, ఉద్యోగావకాశాల కోసం మెజారిటీ కులాలతో పోటీకి దిగిన ఈ తరం ముస్లిం కుర్రవాళ్ళని చూస్తే జాలివేస్తుంది. మైనారిటీ మతం కావటం వల్ల ముస్లిం కుర్రవాళ్ళకి చాలా అన్యాయం జరుగుతోందనిపిస్తుంది.


ప్ర: చెట్టు నా ఆదర్శం, మృత్యు వృక్షం, చిలకలు వాలిన చెట్టు, ఇలా చెట్టుని దృష్టిలో పెట్టుకు కవిత్వం రాశారు. చెట్టు మీకు అంత ఆదర్శం ఎందుకైనట్టు?

జ: నేను చెట్టుని చాలా చోట్ల ప్రతీకగా ఉపయోగించుకుంటున్నాను. ఐతే, అన్ని చెట్లూ ఒకటి కాదు. “చెట్టు నా ఆదర్శం”లో చెట్టు భూమిలో నాటుకుని ఆకాశంలో విస్తరిస్తుంది. దానికి స్థిరమైన పునాదీ, ఎగిరే స్వేచ్ఛా రెండూ ఉన్నాయి. కనుకనే అది విరులు తాల్చగలిగింది. అందుకని, అది నా ఆదేశమైంది. “మృత్యువృక్షంలోది భయంకరమైన తల క్రిందులు చెట్టు. ఇది ఆకస్మాత్తుగా మొలిచి, జ్ఞాపకాల కొమ్మల్నీ, గాఢానుభవాల ఊడల్నీ వెనక్కి పీల్చేసుకుంటుంది. “చిలకలు వాలిన చెట్టు” కవిత్వానికి ప్రతీక. మంచి కవిత్వంలో నవనవోన్మేషమైన ఎర్రటి చిలకముక్కుల్లా చూసే కొద్దీ కొత్త అర్థాలు స్ఫురిస్తూనే ఉంటాయి. కనుక నేను రాసింది చెట్ల గురించి కాదు. నా గురించి, నాకు సంబంధించిన వివిధ విషయాల గురించి రాసుకున్నాను. చెట్టు ఎప్పటికప్పుడు మారిపోయే ప్రతీక. ప్రతి పద్యంలోనూ ఒక కొత్త చెట్టు మొలుచుకొచ్చింది. అన్ని చెట్లూ ఒకటే ననుకుంటే నా పద్యాలు అర్థం కావు. ఏ పద్యానికాపద్యం చదువరి మనస్సులో కొత్తగా నిర్మించవలసిందే.


ప్ర: మీ తమ్ముడు వజీర్ రహ్మాన్ గురించి ఏమైనా చెప్తారా? ఆయన మరణం వల్ల తెలుగు కవిత్వం ఒక మంచి కవిని కోల్పోయిందనుకుంటున్నా. సరే ఆయన ప్రచురించని కవిత్వం ఏమైనా ఉందా? కవిగా వజీర్ రహ్మాను గురించి మీ అభిప్రాయం?

జ: వజీర్ రహ్మాన్ గొప్ప భావుకుడు. చాలా ఆవేశపరుడు. అంతరాళాల్లోంచి తన్నుకొచ్చినట్టుగా, spontaneousగా ఉండేవి అతని పద్యాలు. అతనికి బలమైన ఇష్టాయిష్టాలుండేవి. తనకు నచ్చనిది దేనితోనూ రాజీ పడేవాడు కాదు. ఇంగ్లీష్, బెంగాలీ, హిందీ భాషల్లో బాగా చదివేవాడు.

అతని చివరి పుస్తకం “సాహసి” ప్రచురించిన రెండు నెలల్లోనే చనిపోయాడు. అతని ప్రచురించని తెలుగు పద్యాలున్నాయని అనుకోను. కాని, తనవీ, చలానివీ, నావి కొన్ని కవితలు ఇంగ్లీషులోకి అనువదించాడు. వాటికి చక్కని ఉపోద్ఘాతం కూడా రాశాడు. ఇవన్నీ కలిపి పుస్తకంగా తేవాలని అతని ఉద్దేశం.

త్యాగరాజు కృతులమీద పుస్తకం రాయాలనుకునేవాడు. అది నెరవేరలేదు. అతను నిపుణుడైన ఫోటోగ్రాఫర్ అనే సంగతి చాలా మందికి తెలీదు. సినిమాటోగ్రఫీ అధ్యయనం చేశాడు. అత్యాధునికమైనసినిమా తీయాలనే కోరిక చాలా సార్లు వెలిబుచ్చాడు. భారతీయ, పాశ్చాత్య సంగీతాల్లో అతనికి మంచి అభిరుచి ఉండేది. ఇదికాక, అతను డిజైనర్ కూడాను. ‘సాహసీకీ, నా కవిత్వంలో నిశ్శబ్దానికిఈ అట్టలు అతనే డిజైన్ చేశాడు.


ప్ర: మీ పూర్వీకులెవరన్నా కవిత్వం రాసేవారా? తెలుగు కాకపోతే ఉర్దూలోనన్నా?

జ: మా తాతగారు వజీరుద్దీన్ ఉర్దూ, పార్సీ భాషల్లో కవిత్వం రాసే వారు. ఆయన పేరే వజీర్‌కి పెట్టారు. మా మాతామహులు ఖాసింఖాన్ గారు తెలుగు, సంస్కృతాల్లో నిష్ణాతుడు. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారికి మిత్రుడు. ఇంజరం గ్రామంలో మా తాతగారి ఇంట్లో వెంకటశాస్త్రిగారు ఒక సందర్భంలో శతావధానం ప్రదర్శించారు. ఈ తాతగారినించే నాకు తెలుగు భాషలో అభిరుచి సంక్రమించింది.


ప్ర: ఉమర్ ఆలీషా కవిగారు మీకు బంధువా? ఆయనకి కవి శిష్యులు చాలామంది ఉండేవారని విన్నా. ఆయన గురించి ఏమన్నా విశెషాలు చెప్పగలరా?

జ: ఉమర్ ఆలీషా కవిగారితో మాకు బంధుత్వం ఉంది. ఆయన తెలుగు, సంస్కృతం, ఉర్దూ, పార్శీ భాషల్లో గట్టి పండితుడు. ఉమర్ ఖయ్యాం రుబాయీలు నేరుగా పార్శీ నించి తర్జుమా చేసాడు. స్వాతంత్ర్యానికి పూర్వం రాజకీయాల్లోఈయన ప్రముఖ పాత్ర వహించాడు. సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో అంటే అప్పటి పార్లమెంటులో, ఈయన మెంబర్‌గా చాలాకాలం ఉన్నాడు.

వీరి కుటుంబానికి సంబంధించిన గురుపీఠం వీరి తాతలకాలం నించీ ఉంటుండేది. ఈయన తరానికి వీరే గురువులు. ఈయన శిష్యులు పిఠాపురం తాలూకాలో విస్తరించి ఉన్నారు. అందరూ దాదాపు హిందువులే.

ప్ర: మీకు, వజీర్ రహ్మాన్ గారికి సంగీతం అంటే చాలా ఇష్టం అని విన్నాము. ఇద్దరి దగ్గరా మంచి రికార్డ్ కలెక్షన్ ఉండేదట! మీరు ప్రత్యేకంగా ఇష్టపడ్డ సంగీతకారులెవరు?

జ: శాస్త్రీయ సంగీతం అంటే మా ఇద్దరికీ ఆసక్తి ఉండేది. రికార్డులు కలెక్ట్ చెయ్యడం నేను ప్రారంభించాను. కొంత కాలమయాక, కవిత్వం అసూయాపరురాలైన భార్యవంటిదనీ, వేరే ఉపపత్నుల్ని సహించదని తెలుసుకున్నాను. అలాగే ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్ భాషల అధ్యయనం కూడా నా ఏకాగ్రతకి భంగకరమవుతుందని తెలుసుకుని అదీ మానేశాను. నా రికార్డు కలెక్షన్ ఇచ్చేశాను. అతను దాన్ని పెంచి పెద్దది చేశాడు. నేను పోగు చేసినవి అరుదైన హిందుస్తానీ, కర్ణాటక రికార్డులు. అతనికి పాశ్చాత్య సంగీతంలో అభినివేశం ఉండేది. పాశ్చాత్య సంగీతం, శాస్త్రీయం, అశాస్త్రీయం, చాలా రికార్డులూ, టేపులూ చేర్చి ఈ సమాహారాన్ని పెంచాడతను. అతనికి స్టీరియో సిస్టం నిర్మించి ఇచ్చింది ఎవరో తెలుసా? మలయాళమహాకవి కుమార అసాన్ కొడుకు.


ప్ర: చలం గారిని మీరు కలిసే ఉంటారు. మీ తమ్ముడు వజీర్ రహ్మాన్ ఆయన అల్లుడు కదా? చలం గురించి మీ impressions ఏమిటి?

జ: తిరువణ్ణామలై వెళ్ళి చలం గారిని రెండుసార్లు కలిశాను. ఆయన మొహంలో గొప్ప శాంతి కనిపించింది నాకు. చచ్చుప్రశ్నలు వేసి ఆయన్ని చికాకు పెట్టబుద్ధవలేదు. వరండాలో పాత గ్రాంఫోన్ కనిపిస్తే సైగల్ రికార్డులు పెట్టి వింటూ కూచున్నా. ఆయన వరండాలోకొచ్చి నా కెదురుగా కూచుని సంగీత మాధుర్యంలో ములిగిపోయాడు. మాట్లాడకుండా రెండు గంటల సేపు కూచున్నాం. మా ఇద్దరి తరపునా సైగల్ మాట్లాడాడు.

చలంగారంత నిజాయితీ ఉన్నవాడు నాకు గాంధీ గారొక్కరే కనిపిస్తాడు. గాంధీ గారి లాగా ఈయన చెప్పిందే ఆచరించాడు. ఈయన కూతురు చంపకా, మా తమ్ముడూ పెళ్ళి చేసుకుంటామని ఆయన అనుజ్ఞ అడిగారు. “పెళ్ళెందుకూ? పెళ్ళి చేసుకుంటే కాని కలిసి ఉండకూడదా?” అన్నాడీయన! చలంగారికి వివాహవ్యవస్థంటే కోపం. అన్ని అనర్థాలకీ వివాహం మూలమని ఆయన ధృఢాభిప్రాయం. కూతురి విషయంలో కూడా ఆయన జంకలేదు!


ప్ర: ఈ మధ్య ప్రఖ్యాతి పొందిన, మంచి కవిత్వమే రాసిన కొందరు కవులు, తాము యుగకవులమనో, మహాకవులమనో అనుకుంటూ ఉండడం, ఈ సందర్భంగా అప్పుడప్పుడు చర్చలు జరగడం చూస్తున్నాం కదా. ఈ విషయంలో మీ ఉద్దేశ్యం ఏమిటి?

జ: మన కవులకు ఇంకా కుర్రతనం వదల్లేదన్నమాట! కవిత్వానికి దోహదమిచ్చినంత మేర కవుల్లో పసితనం ఉండడం మంచిదే! “సదా బాలకు”డని నేను టాగోర్‌ని అన్నాను. కాని హద్దు మీరితే నవ్వుల పాలవుతామని కూడా తెలుసుకోవాలి.


ప్ర: నవలల్లో ప్రముఖంగా క్రైం, మోతాదు మించిన సెక్స్, మంత్రాలు, తంత్రాలు, పుర్రెల్లో పాములు - bizarre గా కనిపిస్తున్న ధోరణి మీరు గమనించారా? ఇది సినిమాలకి కూడా పాకింది. అమాయక జనుల్ని మరీ అజ్ఞానంలోకి తోస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ ధోరణిని సహృదయులైన రచయితలు, కవులు ఉధృతంగా నిరసించాల్సిన అవసరం లేదా? వార్తా పత్రికల పాత్రని ఈ విషయంగా మీరు ఎలా అంచనా వేస్తారు?

జ: మీరన్నట్టు అమానుషమైన హింసతో, జుగుప్సాకరమైన్ క్రైంతో, మోతాదుకు మించిన సెక్స్ తో పాఠకుల్ని ఆకర్షించి లాభాలు గడించాలనే దురాశ పత్రికలవాళ్ళలో హెచ్చు పెరిగినట్లు కనిపిస్తోంది. దీనివల్ల వ్యక్తికీ, సంఘానికీ ఎంత ద్రోహం జరుగుతుందో వాళ్ళు గమనించినట్టు లేదు. అన్నిటికన్నా ప్రమాదం హింసని గొప్పగా ప్రదర్శించటం. దీనివల్ల జనాల అభిరుచులు వల్గరైజ్ అవుతాయి. వాళ్ళ అనుభూతి(feeling), చేతనా(sensibility) మొద్దుబారుతాయి. ఇటువంటి కథలు చదివే వ్యసనానికి లోనైనవారు క్రమంగా జంతుస్థితికి దిగజారే ప్రమాదముంది. చేతన మొద్దుబారితే విచక్షణా జ్ఞానం కూడా అడుగంటుతుంది. ఈ ప్రమాదాన్ని ఎవరూ గుర్తించినట్టు లేదు. సామాజిక స్పృహ అని కరవాలం తిప్పే రచయితల సంఘాలేం చేస్తున్నాయి? లాభాల కోసం తలపెట్టిన ఈ పోటీలో పాల్గొంటున్న పత్రికలకి అడుక్కి తప్ప మరో మార్గం లేదు. పాఠకుల్ని ఆకర్షించటం కోసం ఒకర్ని మించి ఒకరు హింసనీ, నేరాన్నీ, అమానుషప్రవర్తననీ, glorify చేయవలసి ఉంటుంది. వీళ్ళ ధనాశకి సామాన్య పాఠకులు బలి అవుతున్నారు. మానవత్వ నాశనానికి కారణమైన ఈ యజ్ఞానికి హోతలైన పత్రికాధిపతుల ధనాశని, స్వార్థపరత్వాన్నీ ఖండిస్తున్నాను.

No comments:

Post a Comment