ఇస్మాయిల్ రచనల సంగ్రహం

ఇస్మాయిల్ గారి హైకూలు, కవితలు, వ్యాసాలు, ఇంటర్వ్యూలు...

Monday, January 23, 2012

శ్రీనివాస్ రాయప్రోలు గారి రచన - "దీపావళి రోజు"


వీళ్ళిద్దరూ
ఇంట్లో కూచునుంటారు
వీళ్ళిద్దరి మధ్యా
మాటామంతీ ఉండదు.
ఒకరికి వినిపించదు
ఒకరికి కనిపించదు.

రాలిపోయే ముందు
చెట్ల ఆకుల్లా
అల్లల్లాడుతూ
మా నాన్నా, అమ్మా.
వాళ్ళని ఒంటరిగా
వదిలేశాం.

పండగ రోజు
కొదుకులూ, కూతుళ్ళూ,
కోడళ్ళూ, మనమలూ,
అందరూ పోగవుతారు
ఆడవాళ్ళు వడ్డిస్తే
మగవాళ్ళు విందు గుడుస్తారు.

ఊసుపోక కబుర్లు తప్పించి
చెప్పుకోటాని కేమీ వుండదు.
కానీ, అందరికీ మనస్సులో
నేరభావమేదో కెలుకుతుంది.

కేరింతాలతో, కయ్యాలతో
పిల్లలకు గడిచిపోతుంది.

అమ్మా, నాన్నలకు మాత్రం
పిల్లల్నీ, మనమల్నీ చూసి
కళ్ళు బాష్పాలతోనూ
గుండెలు సంతృప్తి తోనూ
నిండిపోతాయి.
పెరట్లో మామిడి చెట్టు
పిట్టలతో నిండిపోతుంది.

సాయంత్ర మయాక
అంతా సెలవు తీసుకుంటారు.
మా గుండెలు
శూన్యంతో నిండిపోతాయి.
రేపటి సంగతి వేరు.
గోడల కేసి,
గోడల మీద పటాల కేసి చూస్తూ
ఒకరి కొకరు తోడుగా
ముసిలి వాళ్ళిద్దరూ
మిగిలిపోతారు చివరికి.

No comments:

Post a Comment